Friday, September 19, 2014

నర నరాలలో జీర్ణమైన రామనామం

తెలుగు వాళ్లకు రాములవారికి గల సంబంధం విశిష్టమైనది. రామమందిరం లేని ఊరు తెలుగు సీమలో ఉండదంటే అతిశయోక్తి కాదు. పసిపాపలు కూడా రాములవారిని చూస్తే జేజి పెట్టక మానరు. రామాలాలి పాడి పిల్లలను నిద్దురపుచ్చడం తెలుగుపడుచులకు అలవాటు.

కలియుగమునందు నామసంకీర్తన వల్ల పాపరాశి నాశనమగునని శాస్త్రవాక్కు. ఆశ్చర్యమందిన వేళ అయ్యోరామా! అను మాట మిగుల వాడుదురు. ఏదేని చూడకూడని దృశ్యం చూచిన, వినజాలని మాట వినినగాని రామరామయని అందురు. అన్నార్తులు అన్నమోరామచంద్రా! అని ఏడ్చెదరు. ఏ ప్రభువేని ప్రజను రంజించిల్లునట్లు పాలించిన రామరాజ్యమును తలపించెనని నుడియాడుదురు.  ఉదయమందు కౌసల్యా సుప్రజా రామా అను మంత్రం మార్మోగును. పిల్లలకు అనుదినం శ్రీరామ రక్ష కట్టుట తెలుగు తల్లుల దినచర్యలో భాగమైనది.  క్రొత్త పుస్తకమును ఆరంభించుట శ్రీరామ వ్రాయుటతోనే. 

శ్రీరామ నామము తెలిసిపలికిన, తెలియక పలికిన పాపరాశి ధ్వంసమగును. ఒకనాడు దారిదోపిడి చేయుదొంగలు ఇట్లు మాట్లాడుకొనిరట 'వనేచరామ వసుచరామా' అనగా 'వనమందు సంచరించెదము, యాత్రికులను దోచుకొందుము'. కాని వారి పలుకులయందు రామ నామముచ్చరించుట మాత్రం చేత వారు  సద్గతుల  పొందిరి. అది రామనామ మహిమ.

No comments: